NationalNews Alert

తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్ లలిత్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. కొత్త సీజేఐ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్ లలిత్ నవంబర్​ 8న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాలని కేంద్రం కోరింది. దీంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ఆయన ప్రతిపాదించారు. 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సీజేఐ సిఫార్సు చేస్తారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీజేఐ జస్టిస్​ లలిత్​ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు.