సూర్యుడిపై ఇస్రో పరిశోధనలు…ఆదిత్య ఎల్1 ప్రయోగం
సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) సమాయత్తం అయ్యింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే ఇస్రో, నాసా చర్చలు జరిపాయి. ఈ ప్రయోగం 2020లోనే చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ56 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా క్రోమో స్పియర్, ఫోటో స్పియర్లపై అధ్యయనం చేయనునట్లు ఆయన తెలిపారు.
మరో ఘనత దిశగా..
బెంగళూరులోని యు.ఆర్.రావు స్పేస్ సెంటర్లో ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–1, చంద్రయాన్–2, అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్యాన్–1 అనే మూడు ప్రయోగాలను అతి తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ప్రయోగించి ఇస్రో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇదే క్రమంలో ఇప్పుడు సూర్యుడి పైకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు.

ఈ ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో పేలోడ్స్ 244 కిలోలు కాగా, ద్రవ ఇంధనం 1,231 కిలోల బరువుటుందని తెలిపారు. సూర్యుడి వైపు తీసుకెళ్లడం కోసం ఎక్కువ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. తొలుత ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఆతర్వాత.. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1(ఎల్–1)లోకి చేరవేయనున్నారు. ఇందుకోసం 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిపై మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్ను అమర్చి పంపిస్తున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసేందుకు..
సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సౌర గోళానికి కోన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉన్న… అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 10 లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత 6000 కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. దీనిపైన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం ద్వారా పరిశోధనలు చేయనున్నారు. అలాగే సౌర తుపాన్ సమయంలో భూమిపై సమాచార వ్యవస్థకు అటంకాలు ఏర్పడుతున్నాయని అంచనా వేశారు. ఈ ప్రయోగం ద్వారా ఫొటో స్పియర్, క్రోమో స్పియర్లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.