InternationalNews Alert

రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారత్.. ఇదే తొలిసారి

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్దం మొదలై ఆరు నెలలు అవుతోంది. ఇంకా ఈ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఆపేయాలని ఐక్యరాజ్య సమితి రష్యాను ఎన్నిసార్లు సూచించినా పుతిన్ మాట వినలేదు. ఐరాస సభ్య దేశాలు రష్యాకు వ్యతిరేకంగా నినదిస్తున్నా.. భారత్ మాత్రం ఇన్నాళ్లూ మౌనంగా ఉంటూ వస్తోంది. గతంలో నిర్వహించిన కీలక ఓటింగ్‌లోనూ భారత్ పాల్గొనలేదు. అయితే… తొలిసారి భారత్.. రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిచేందుకు అనుకూలంగా నిలిచింది భారత్. ఆరు నెలల క్రితం రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి భారత్ తటస్థ వైఖరినే అవలంభిస్తోంది. ఈ సారి మాత్రం చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చైనా కూడా ఈ ఓటింగ్‌కు దూరంగా ఉంది తప్ప వ్యతిరేకించ లేదు.

యుద్ధ పరిస్థితులపై సమీక్ష

ఉక్రెయిన్‌ 31వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో యుద్ధ పరిస్థితులను సమీక్షించారు. ఈ సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దీనిపై రష్యా నిరసన వ్యక్తం చేసింది. ప్రొసీజరల్ ఓటింగ్‌ చేయాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. మొత్తం 15 సభ్యదేశాలు కలిగిన భద్రతా మండలిలో 13 దేశాలు జెలెన్‌ స్కీ ప్రసంగానికి అనుకూలంగా ఓటు వేశాయి. రష్యా మాత్రమే వ్యతిరేకించింది. ఆ తరవాత జెలెన్‌ స్కీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.