ఆ పని చేస్తే ..భారత్ పై 500 శాతం సుంకాలు
రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ కు ముప్పు తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సారి హెచ్చరించారు. భారత్ , చైనాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని యూఎస్ సెనేట్లో దీనిపై బిల్లు తెస్తామని అమెరికా తెలిపింది. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్ కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తాం. ఆ దేశం నుంచి చమురును భారత్, చైనాలు 70శాతం కొనుగోలు చేస్తున్నాయి’ అని లిండ్సే పేర్కొన్నారు. ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారని వెల్లడించారు. రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యూఎస్ ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఇక, ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క భారత్ తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చాలా తక్కువ సుంకాలతోనే ఈ డీల్ ఉండనున్నట్లు తెలిపారు. ‘త్వరలోనే భారత్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నాం. అది ఒక కొత్త డీల్ అవుతుంది. ప్రస్తుతం భారత్ ఇంకా దాన్ని అంగీకరించలేదు. వాళ్లు డీల్ కు ఒప్పుకుంటే తక్కువ సుంకాలు విధించేలా ఒప్పందం కుదురుతుంది’ అని అధ్యక్షుడు పేర్కొన్నారు. జులై 9 కల్లా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై చర్చలు కూడా జరుపుతున్నాయి.