NewsNews AlertTelangana

భాగ్యనగరంలో అద్దె ఇళ్లకు మళ్లీ పెరగనున్న డిమాండ్

కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఆఫీసులు పునఃప్రారంభం కావడంతో వర్క్ ఫ్రం హోమ్‌కి స్వస్తి పలికి వర్క్ ఫ్రం ఆఫీస్‌కు మారుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు ఇళ్ల అద్దెలపై పడుతోంది. కోవిడ్ 19 ప్రభావం తగ్గడంతో హైదరాబాద్ మహా నగరంలో వర్క్ ఫ్రం హోం తగ్గిపోతోంది. తిరిగి ఆఫీసులు యథావిథిగా పనిచేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్‌కు మారిపోతోంది.

హైదరాబాద్ అంటేనే ఐటీ పరిశ్రమలు గుర్తొస్తుంది. వర్క్ ఫ్రం హోం కారణంగా రెండేళ్ల క్రితం తమ తమ ఊళ్లకు వెళ్లిన ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని పిలవడంతో ఇప్పుడు ఐటీ ఉద్యోగులంతా సరైన అద్దె ఇళ్ల కోసం చూస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాల్లో అద్దె ఇళ్లు, రూమ్స్, హాస్టల్స్‌, ప్లాట్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. రెసిడెన్షియల్ డిమాండ్ అనేది ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెరిగింది. తాజాగా విడుదలైన అనారాక్ నివేదిక ప్రకారం అగ్రస్థాయి నగరాల్లో రెసిడెన్షియల్ డిమాండ్ పెరగడం వల్ల అద్దెలు 5 నుంచి 10 శాతం పెరిగినట్టు సమాచారం. ఫిస్కల్ రెండో క్వార్టర్ నివేదిక ప్రకారం దేశంలోని టాప్ 7 నగరాల్లో 15,800 యూనిట్ల రెసిడెన్షియల్ సప్లైతో 19 శాతం వాటాతో హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. రెసిడెన్షియల్ అమ్మకాలు నగరంలో రెండు జోన్లుగా ఉన్నాయి. పశ్చిమ, ఉత్తర హైదరాబాద్ జోన్లు. ఎక్కువ మంది ఇళ్ల కొనుగోలుకు కాకుండా అద్దె ఇళ్లకే ప్రయత్నిస్తున్నారు. కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, ఎల్బీ నగర్, అదిభట్ల వంటి ఐటీ కారిడార్ సమీప ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు 5-10 శాతం పెరిగిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర ప్రాంతాల్నుంచి అంతా తిరిగి జంట నగరాలకు చేరుకోవడంతో అద్దె ఇళ్లకు డిమాండ్ అధికమైంది.