Home Page SliderTelangana

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రదేశాల్లో చెట్లు విరిగి పడ్డాయి. భారీ వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముదెంది. ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనానికి సమాంతరంగా ద్రోణి కొనసాగుతుండడంతో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. తెలంగాణలోని 23 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని వాతావరణ అధికారులు సూచించారు. తెలంగాణలోని ములుగు, వరంగల్, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇవాళ, రేపు, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ వెల్లడించింది. ఏపీలోనూ నిన్న కురిసిన అకాల వర్షాలకు రైతులకు పంట నష్టం కలిగింది. అరటి చెట్లు నేలకొరిగాయి. ఇవాళ అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, అనంతపూర్ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.