భార్యను పెట్రోల్ పోసి చంపేశాడు
సాఫీగా సాగిపోతున్న సంసారంలో అనుమానం చిచ్చు అగ్గి రాజేసింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను సజీవదహనం చేశాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన అంబర్ పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్ పేట పటేల్ నగర్ బిలాల్ మజీదు బస్తీకి చెందిన నవీన్ (32), రేఖ (28) భార్యాభర్తలు. ఎంతో సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. భార్య రేఖపై అనుమానం పెంచుకున్న నవీన్ తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. మార్చి 10వ తేదీ రాత్రి దంపతుల మధ్య మళ్లీ గొడవపడటంతో.. కోపోద్రిక్తుడైన మద్యం మత్తులో భార్య రేఖను అంతమొందించాలని అనుకున్నాడు.అంతే.. తన బైక్లో ఉన్న పెట్రోల్ తెచ్చి అమాంతం భార్య రేఖపై పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కాసేపటి తర్వాత మంటలు ఆర్పివేసిన నవీన్.. అత్తమామాలకు ఫోన్ చేసి.. రేఖ ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపాడు. ఆస్పత్రిలో చేర్చించానని, చికిత్స అందిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నవీన్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.