వేదపండితులకు గుడ్ న్యూస్..మంత్రి
తిరుమల: ఆంధ్రప్రదేశ్లో వేదపండితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని.. వారికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సంయుక్త సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో సమీక్షించి తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆనం వివరించారు.
‘గతంలో సీఎం చంద్రబాబుతో నిర్వహించిన సమీక్షలో ఆలయాలకు సంబంధించిన పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఆయా సమస్యలపై చర్చించి రావాలని సీఎం ఆదేశించారు. శ్రీవాణి ట్రస్టు నిధులపై నిర్ణయం తీసుకుంటామని బోర్డు చెప్పింది. విజయవాడ దుర్గ గుడికి మరో రోడ్డు వేసేందుకు తితిదే సహకారం కావాలి. తితిదే బోర్డులో అన్యమతస్థులు ఉన్న విషయం వాస్తవం. తితిదే బోర్డులో దాదాపు 1000 మంది అన్యమతస్థులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. తితిదే పరిధిలోని కళాశాలలు, పాఠశాలల్లో 192 పోస్టుల భర్తీపై చర్చలు జరుపుతున్నాం” అని మంత్రి పేర్కొన్నారు.