ఆ రోజుల్లో శ్రీవారి దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 25న కోయిల్ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. దీంతో 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల(మార్చి)23న స్వీకరించి 24న దర్శనానికి అనుమతించనున్నట్లుగా టీటీడీ తెలిపింది.వీకెండ్ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఘాట్ రోడ్డులో పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులతో అలిపిరి మొదటి మెట్టు వద్ద రద్దీ నెలకొంది.