నా భద్రతపై అనుమానమే?: ఏసీబీ కోర్టుకు తెలిపిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది.
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్గా కోర్టు జడ్జి ఎదుట హాజరు పరిచారు. అనంతరం రిమాండ్ను నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని ఆయనకు జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా తీశారు. ఆయన మెడికల్ రిపోర్టులను అందివ్వాలని ఆదేశించారు.