విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ విద్యాశాఖపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు. అంతేకాకుండా ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ పాఠశాలల్లో టాప్ 10 ర్యాంకులు 64 మంది విద్యార్థులు సాధించారని అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా..సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు జరిగేలా చూస్తున్నామన్నారు. యూనిట్ టెస్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి..వారికి మరింత బోధన ,శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు సీఎంకు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని తరహ ప్రభుత్వ కాలేజీల్లో టాప్ 10 ర్యాంకులు 27 మంది విద్యార్థులు సాధించారని అధికారులు సీఎం జగన్కు తెలియజేసారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీల ఉండేలా చూసుకోవాలన్నారు. అయితే ఈ జూనియర్ కాలేజీల్లో ఒకటి బాలికలకు మరోకటి కో-ఎడ్యుకేషన్ ఉండాలన్నారు. జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా పట్టణాల్లో రెండు హైస్కూల్స్ను ఏర్పాటు చేసి వాటిని జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. వచ్చే జూన్ నాటికి ఈ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో నాడు -నేడు కార్యక్రమం ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ మేరకు సరిపడా సిబ్బందిని అక్కడ నియమించాలని విద్యాశాఖ అధికారులకు సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు.

