రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. టీడీపీ పార్టీ తలపెట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 28న కందుకూరు, 29న కావలి, 30న కోవూరులో జరిగే ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో చంద్రబాబు సమావేశం అవుతారని తెలిపారు. చంద్రబాబు పర్యటనకు జగన్ సర్కారు అడ్డంకులు సృష్టిస్తోందని రవిచంద్ర ఆరోపించారు. కావలిలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించారని ఆయన ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. చంద్రబాబు కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.