జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండు విడతల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 6న ముగుస్తాయని జోషి తెలిపారు. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరగనున్నాయని చెప్పారు. ఫిబ్రవరి 14 తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుందని పేర్కొన్నారు. రెండో విడతలో మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6తో సమావేశాలు ముగియనున్నట్లు తెలిపారు. 66 రోజుల వ్యవధిలో మొత్తం 27 రోజుల పని దినాల్లో ఈ సమావేశాలు కొనసాగుతాయని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ అమృత కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు.

