పెళ్లిలో గజరాజుల స్వైరవిహారం-బైక్పై పారిపోయిన వధూవరులు
పశ్చిమ బెంగాల్లోని జార్ గ్రామ్ అనే గ్రామంలో గజరాజులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ దాటికి పెళ్లికి వచ్చిన వారు పారిపోగా, వధూవరులు బైక్పై పారిపోయారు. ఈ గ్రామంలో ఏనుగులు కొన్ని రోజులుగా హంగామా సృష్టిస్తున్నాయి. ఎక్కడైనా పబ్లిక్ స్థలాలలో ఆహారం కనిపిస్తే వదిలి పెట్టడం లేదు. ఇలాగే జార్ గ్రామ్ దగ్గరలోని జోవాల్ భంగా అనే గ్రామంలో తన్మోయ్ సింఘా, మంపి సింఘాల పెళ్లి జరుగుతుండగా వచ్చేశాయి గజరాజులు. వివాహ కార్యక్రమం పూర్తి చేసుకుని భోజనాలకు సిద్ధమైన అతిధులను బెదరగొట్టేశాయి. బంగాళాదుంపల కూర్మా, ఉలవ చారుల వాసన పసిగట్టి అతిథుల కంటే ముందే భోజనాలకు వచ్చేశాయి ఏనుగులు. కళ్యాణ మండపంలో అవి రాద్ధాంతం చేయడంతో అందరూ కాలికి పని చెప్పారు. వధూవరులు దొరికిన బైక్ ఎక్కి దానిపై ఉడాయించారు. గత కొన్నాళ్లుగా ఈ గ్రామాల వారు ఏనుగులకు భయపడి ఏ కార్యక్రమాలనూ నిర్వహించడం లేదు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, సామూహిక భోజనాలకు దూరంగా ఉంటున్నారు.