రెండు గ్రహణాలు శ్రీవారి ఆలయం మూసివేత
సూర్య,చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. గ్రహణం రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. సూర్యగ్రహణం రోజు ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు, చంద్రగ్రహణం రోజు ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నామని పేర్కొంది. గ్రహణాల రోజుల్లో బ్రేక్, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశామని కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తామని వెల్లడించింది. సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొలగిపోయే వరకు వంట చేయరు దీంతో గ్రహణాల సమయంలో అన్నప్రసాద పంపిణీ సైతం నిలిపివేస్తున్నట్లు తితిదే పేర్కొంది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి అసౌకర్యానికి గురి కాకుండా ఉండేందుకు వీలుగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేస్తుంది.

