Home Page SliderTelangana

మోదీ తిరిగి ప్రధాని కాావాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి-అమిత్ షా

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీ గారిని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా. ఇవాళ బీజేపీ ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 75 ఏళ్ల ఆజాదీకా అమృతోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు అమిత్ షా భవిష్యత్ దర్శనం చేశారు. తెలంగాణలో అక్రమ, అవినీతి, కుటుంబ పాలకులు, రజాకార్ల మద్దతుతో కొనసాగుతున్న కల్వకుంట్ల ప్రభుత్వానికి తిరోగమనం మొదలైందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. తెలంగాణ విమోచన సంగ్రామంలో నాటి తెలంగాణ యువత ప్రాణత్యాగం చేశారని… కానీ 9 ఏళ్లుగా రజాకార్ల పార్టీతో అంటకాగుతూ.. నాటి ప్రజల త్యాగాలకు విలువలేకుండా కేసీఆర్ చేశారని విమర్శించారు. ఖమ్మం ప్రజలారా… నా మాట గుర్తుంచుకోండి… ఎన్నికలు వస్తున్నాయి. కేసీఆర్ ఓడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి రానుందన్నారు.

భద్రాచలానికి దక్షిణభారతపు అయోధ్యగా పేరుందన్న అమిత్ షా, భద్రాచల మందిర నిర్మాణం కోసం భక్తరామదాసు పడిన పాట్లు.. అన్నీ ఇన్నీ కావన్నారు. నిజాం ఏలుబడిలో జైలుపాలయ్యేందుకు కూడా సిద్ధమయ్యాడన్నారు. 17వ శతాబ్దం నుంచి తెలంగాణలో ఎవరు పాలించినా.. రామనమవి నాడు.. ప్రభుత్వం తరపున భద్రాచలం రాముడి కల్యాణ రాముడికి వస్త్రాలు సమర్పించడం ఓ ఆనవాయితీగా వస్తోందన్న అమిత్ షా, కేసీఆర్.. ప్రభుత్వంలో మాత్రం.. కారు..భద్రాచలం వరకు వస్తుంది. కానీ మందిరంలోకి కారు వెళ్లకుండా.. ఆగుతోందన్నారు. ఎందుకంటే మందిరంలోకి వెళ్తే మిత్రుడికి బాధ కలుగుతుందనే ఆలోచన కేసీఆర్‌దన్నారు. రేపు బీజేపీ ప్రభుత్వం రాగానే.. మా సీఎం ఎవరున్నా.. కమల పుష్పాన్ని భద్రాచల రాముడి పాదపద్మముల ముందు అర్పిస్తామన్నారు.
కేసీఆర్ భద్రాచలం ఇక రావాల్సిన అవసరం లేదన్న అమిత్ షా, స్టీరింగ్ చేతుల్లోలేని కేసీఆర్ కారు.. మనకు అవసరం లేదన్నారు. వచ్చే ప్రభుత్వం.. నరేంద్రమోదీ గారి ఆశీస్సులతో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. అందులో సందేహం లేదన్నారు.

బీజేపీ నేతలమీద దౌర్జన్యాలు, అక్రమ నిర్బంధాలు చేస్తే, బెదిరింపులకు గురిచేస్తే.. వాళ్లు వెనక్కు తగ్గుతారని అనుకుంటున్నారని… అలా అనుకోవడం పొరపాటన్నారు అమిత్ షా. మా కిషన్ రెడ్డిని, మా బండి సంజయ్ ను, మా ఈటలని అడ్డుకుంటే.. మేం వెనక్కు తగ్గేదేలేదన్నారు. కేసీఆర్ నీ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 4జీ పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ.. 2జీ పార్టీ అని, మజ్లిస్ పార్టీ.. 3 జీ పార్టీ అని… ఇప్పుడు ఈ 2జీ, 3జీ, 4జీ పార్టీలకు కాలం చెల్లిందన్నారు షా. తెలంగాణలో వచ్చేది బీజేపీ పార్టీయేనన్నారు. పేదలకు ఇండ్లు, యువతకు ఉద్యోగాలు, దళితులకు ఆర్థికంగా భరోసా ఇస్తానన్నాడు… రైతులకు మరో హామీ.. ఇలా అబద్ధపు హామీలు ఇవ్వడం తప్ప కాలం వెల్లదీస్తున్నాడు తప్ప పేదలకు ఏమీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ.. ఆనాడు రైతులకోసం 22వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఇవాళ మోదీ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. లక్షా 28వేల కోట్ల బడ్జెట్ పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం 7 లక్షల కోట్ల అప్పులు, ఇతర సబ్సిడీలిస్తే.. మోదీ ప్రభుత్వం20 లక్షలకోట్ల విలువైన సహాయ సహకారాలు అందిస్తోందన్నారు అమిత్ షా. ధాన్యం సేకరణ విషయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం 475 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, మోదీ ప్రభుత్వం 900 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించిందన్నారు. బియ్యం మీద కనీస మద్దతు ధర 67శాతం పెంచామన్నారు. 11కోట్ల మంది రైతులకు, 2.60 లక్షల కోట్ల కిసాన్ సమృద్ధి నిధిని అందిస్తున్నామన్నారు. 10వేల FPOలను ఏర్పాటుచేసే పని మోదీ ప్రభుత్వం చేస్తోందన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేగారు మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని అంటున్నాడు. కేసీఆర్.. గుర్తుపెట్టుకో.. ఏం జరిగినా.. ఒవైసీ, కేసీఆర్ తో బీజేపీ పార్టీ.. పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. మిత్రులారా.. బీజేపీ ఎప్పుడైనా ఒవైసీతో కలుస్తుందా..? బీఆర్ఎస్ తో కలుస్తుందా..? ఈ రెండు పార్టీలతో కనీసం వేదిక కూడా పంచుకునే పరిస్థితి లేదు. అలాంటిది వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే ఆలోచన అర్థరహితమన్నారు అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని నిధులు ఇచ్చిందో తెలుసా.. ? అంటూ లెక్కలు వివరించారు అమిత్ షా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని, బీజేపీ ఒక్క తెలంగాణకే.. 2.80 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. తెలంగాణలో మోదీ 33 లక్షల మంది పేదలకు మరుగుదొడ్లు కట్టించారన్నారు. 1.90 లక్షల మంది పేదలకు నెలకు 5కిలోల ఉచిత రేషన్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో 11 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చామన్నారు. 2.5 లక్షల మంది పేదలకు ఇండ్లు మోదీ ఇచ్చారన్నారు అమిత్ షా. ఈ రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువత వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపి.. బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.