కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో బంగ్లా ప్రధాని భేటీ
నాలుగు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న ప్రధాని మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త అదానితో భేటీ అయిన ఆమె ఈరోజు కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈశాన్య భారతం-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈశాన్య రాష్ట్రాలతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకోవడం ద్వారా ఇరుదేశాల్లో వివిధ అంశాల్లో సానుకూల ఫలితాలకు ఆస్కారం ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్స్, బార్డర్ హాట్స్, ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా సరిహద్దు వాణిజ్యానికి మరింత ఊతం లభిస్తుందనే అంశాన్ని ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా దృష్టికి మంత్రి కిషన్ రెడ్డి తీసుకొచ్చారు.

వ్యవసాయం, తేయాకు ఎగుమతికి బంగ్లాదేశ్ రేవుల సహకారం. పర్యాటకం, వాణిజ్యం తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన విషయాలను కూడా ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించారు. దీనికి సంబంధించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణను పరిశీలించవలసిందిగా బంగ్లాదేశ్ ప్రధానిని కిషన్ రెడ్డి కోరారు. ఈశాన్య భారతం అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.