MMTS ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం..!
హైదరాబాద్ లో దారుణం జరిగింది. MMTS ట్రైన్లో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ఆగంతకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆగంతకుడు నుంచి తప్పించుకోవడానికి యువతి రైలులో నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలతో గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువతి పడిపోయింది. అటుగా వెళ్తున్న పాదచారుడు 108కు సమాచారం ఇవ్వడంతో గాంధీ హాస్పిటల్కి తరలించారు. బాధితురాలు అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతి (23)గా గుర్తించారు. మేడ్చల్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో యువతి పని చేస్తుంది. సికింద్రాబాద్లో తన సెల్ఫోన్ రిపేర్ చేయించుకుని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మహిళల బోగీలోకి ప్రవేశించి.. ఒంటరిగా ఉన్న తనపై ఓ ఆగంతకుడు అత్యాచారయత్నం చేశాడని ఆమె పేర్కొంది. యువకుడు చెక్స్ షర్ట్ ధరించి నల్లగా, సన్నగా ఉన్నాడని.. సుమారు 25 ఏళ్ల వయసు ఉంటుందని యువతి తెలిపింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపారు.

