అమితాబ్ కామెంట్స్తో రాజకీయ దుమారం
భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. అమితాబ్ వాక్ స్వాతంత్ర్యంపై మాట్లాడటం.. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇప్పటికీ పౌర హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి అని అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యలు చేశారు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాని సినిమాపై వివాదం జరుగుతున్న వేళ.. అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి దారి తీసింది. వెస్ట్ బెంగాల్లో కోల్కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా హాజరయ్యారు. అమితాబ్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు.

అమితాబ్ కామెంట్పై బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాల్వియా ట్విట్టర్లో స్పందించారు. మమత నాయకత్వంలో ఈ దేశం ఎన్నికల అనంతరం ఘోరమైన హింసను చవిచూసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రతిష్ఠను ఆమె దిగజారుస్తున్నారని ఆరోపించారు. అమిత్ మాల్వియా ట్వీట్కు తృణమూల్ ఎంపీ నుశ్రత్ జహాన్ కౌంటర్ ఇచ్చారు. సినిమాలపై నిషేధం విధించడం, జర్నలిస్టులను నిర్భంధించడం, నిజం మాట్లాడినందుకు సామాన్యలను శిక్షించడం.. ఇవే నిరంకుశ పాలన సంకేతాలన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై పరిమితులు విధించడం కూడా ఆ పాలనకు నిదర్శనమేనన్నారు. ఇదంతా బీజేపీ హయాంలోనే జరుగుతోంది. కానీ, అమిత్ మాల్వియా మాత్రం ఇతరులను నిందించడంలో బీజా ఉన్నారంటూ నుశ్రత్ గట్టిగా బదులిచ్చారు.