దాతృత్వంలోనూ అదానీ టాప్.. రూ.60 వేల కోట్ల దానం
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆదాయం సంపాదించడంలోనే కాదు.. దానం చేయడంలోనూ అగ్రస్థానంలో నిలిచారు. ఆసియాలో దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేసే వారి జాబితాను ‘దాతృత్వంలో ఆసియా హీరోలు’ పేరిట ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. మరోవైపు అదానీ గ్రూపు తరఫున ఈ ఏడాది ఏకంగా రూ.60 వేల కోట్లు దాతృత్వానికి ఖర్చు చేయనున్నట్లు గౌతమ్ అదానీ తన 60వ జన్మదినం సందర్భంగా జూన్లో ప్రకటించారు. చదువు, వైద్యం, నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాలకు ఈ డబ్బును వెచ్చిస్తామన్నారు. తమ ఫౌండేషన్ ద్వారా సంవత్సరానికి 37 లక్షల మందికి సాయం చేస్తామన్నారు.
aa
కొన్న దశాబ్దాల నుంచి ఎన్నో దాన, ధర్మాలు చేస్తున్న శివ్ నాడార్ కూడా ఫోర్బ్స్ దాతృత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా ఈ ఏడాది రూ.11,600 కోట్లతో స్కూళ్లు, యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులను ఆదుకుంటామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. తాను నెలకొల్పిన మెడికల్ రీసెర్చ్ ట్రస్ట్కు రూ.600 కోట్లు అందజేస్తామని అశోక్ సూతా అనే టెక్ దిగ్గజం ప్రకటించారు. స్కాన్ పేరిట 2021 ఏప్రిల్లో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా వృద్ధాప్యం, నరాల సంబంధిత అనారోగ్యాలపై పరిశోధన చేస్తారు. ఈ డబ్బును పదేళ్ల పాటు పరిశోధనలు చేసేందుకు ఖర్చు చేస్తారు. మలేసియాకు చెందిన ప్రవాస భారతీయుడు బ్రహ్మల్ వాసుదేవన్, ఆయన భార్య శాంతి కూడా ఫోర్బ్స్ దాతృత్వ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మలేసియాలో టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటుకు వీళ్లిద్దరూ 11 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు.