కొద్ది రోజుల్లో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను పూర్తి చేసి 4 వేల మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో మంత్రుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్లోని స్టేజి-1 లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ గ్రిడ్డుకు అనుసంధానం చేసే కార్యక్రమం ఈరోజు విజయవంతంగా జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని 2028-29 నాటికి 22,288 మెగావాట్లు అవకాశం ఉంటుందని అంచనా వేశారు. విద్యుత్తుకు ఇబ్బంది రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాతావరణం కలుషితం కాకుండా 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురావడంలో మేధావులు విద్యుత్తు నిష్ణాతులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుని శాసనసభలో చర్చించి అందరి అభిప్రాయంతో న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడం జరుగుతుందని అన్నారు.