లాభాల్లో స్టాక్ మార్కెట్
మూడు రోజుల వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం, అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగింపు దశకు చేరుకోవడం, అలాగే ఐటీ , ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు బలపడటంతో మార్కెట్ మళ్లీ ఊపందుకుంది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2 లక్షల కోట్లు పెరిగి రూ.468 లక్షల కోట్లకు చేరింది. మదుపర్ల విశ్వాసం తిరిగి పుంజుకోవడంతో మార్కెట్ వాల్యూమ్లు కూడా మెరుగుపడ్డాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ (83,198.20 పాయింట్లు) కాసేపటికే లాభాల బాట పట్టింది. కొనుగోళ్లు చివరి వరకు కొనసాగడంతో సూచీ 319.07 పాయింట్లు పెరిగి 83,535.35 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 82.05 పాయింట్లు ఎగసి 25,574.35 వద్ద స్థిరపడింది.డాలరుతో రూపాయి మారకం విలువ రూ.88.71 వద్ద కొనసాగింది.ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ (టీఎంపీవీ) వంటి షేర్లు బలమైన లాభాలు నమోదు చేశాయి.
ట్రెంట్, ఎటెర్నల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి.

