Andhra PradeshHome Page SliderNewsSpiritual

ఒంటిమిట్ట చెరువులో కోదండరాముడు

ఒంటిమిట్ట: ఆంధ్రప్రదేశ్ భద్రాచలంగా పేరుగాంచిన పవిత్ర క్షేత్రం ఒంటిమిట్టలో శ్రీరామచంద్రమూర్తి భారీ విగ్రహానికి టీటీడీ ప్రతిపాదించింది. రామయ్య పాదస్పర్శతో పునీతమైన ఒంటిమిట్టను జాతీయ పర్యాటక, ఆధ్యాతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది టీటీడీ. భక్తులకు ఆకర్షణీయంగా, వారి మనసు దోచేలా రామయ్య క్షేత్రం వద్ద ఉన్న చెరువు మధ్యలో ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ తటాకం జలాల మధ్యలో 600 అడుగులు ఎత్తుతో ఆకర్షణీయంగా నిర్మించాలని కొత్త బృహత్తర ప్రణాళికలో రూపొందించారు. విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు ఇటీవల టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను సమర్పించారు. రానున్న 30 ఏళ్లలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేశారు. కడప-రేణిగుంట జాతీయ రహదారి, చెన్నై-ముంబయి రైలు మార్గం మధ్యలో చెరువు ఉంది. అందులో రాములవారి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి ఒంటిమిట్ట దర్శనానికి వచ్చే పర్యాటకులు మురిసిపోయేలా ఈ ప్రాంతాన్ని సుందరంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేశారు.