బెన్స్టోక్స్ పై భారత క్రికెట్ దిగ్గజం ఫైర్
మాంచెస్టర్ టెస్టు చివరి రోజున ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్ నిలిచిపోతుందని.. టీమ్ఇండియా పోరాటం అద్భుతమని కొనియాడాడు. తొలి టెస్టు తర్వాత స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వారికే తిరిగి తగిలాయని సన్నీ గుర్తు చేశాడు. 600+కిపైగా పరుగుల లక్ష్యం ఇచ్చినా ఛేదించి గెలుస్తామన్న ఇంగ్లాండ్… ఇప్పుడు మాత్రం భారత్ను అడ్డుకోలేకపోయిందని విమర్శించాడు. ముందస్తు ‘డ్రా’ ఎత్తులు వేసిన బెన్స్టోక్స్కు గిల్ కొన్ని ప్రశ్నలు సంధించి ఉంటే బాగుండేదని.. ప్రత్యర్థి పట్ల కాస్త కటువుగా ఉండాలని భారత సారథికి సూచించాడు.నాకు చాలా సంతృప్తి ఇచ్చిన మ్యాచ్. భారత జట్టు ఆడిన తీరుపై గర్వపడుతున్నా. కేవలం నాలుగు వికెట్లను మాత్రమే ప్రత్యర్థికి ఇచ్చారు. మంచి పిచ్, ఫ్లాట్ పిచ్ ఏదైనా సరే తీవ్ర ఒత్తిడిలో ప్లేయర్ల ఆట ఆకట్టుకుంది. ఇక్కడ నేను చాలా ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నా. అదీ ఇంగ్లాండ్ జట్టును. బర్మింగ్ హామ్లో భారత జట్టు ఇంగ్లాండ్కు 600+ టార్గెట్ను నిర్దేశించింది. అప్పుడు టీమ్ఇండియా భయపడిందని ఇంగ్లాండ్ నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. అంతకుముందు లీడ్స్లో 370+ లక్ష్యాన్ని కొట్టిన ఊపులో ఎంతైనా కొడతామని ప్రగల్భాలు పలికిన ఇంగ్లాండ్.. రెండో టెస్టులో మాత్రం 336 పరుగుల తేడాతో ఓడింది. మరి ఆ ధైర్యం ఏమైంది?’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.‘‘శుభ్మన్ గిల్ ప్రత్యర్థికి గట్టిగా బదులు ఇవ్వాలి. ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాలి. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చుంటే బాగుండేది. అప్పుడు స్టోక్స్కు కొన్ని ప్రశ్నలు సంధించమని గిల్కు చెప్పేవాడిని. ‘ నువ్వు ఎందుకు 311 పరుగుల వరకూ ఆధిక్యం తీసుకెళ్లావు? 240 పరుగుల లీడ్తో సరిపెట్టుకోవచ్చుగా? కనీసం నీ సెంచరీ తర్వాతనైనా డిక్లేర్డ్ చేయొచ్చుగా? అప్పుడు మీ బౌలర్లకు అదనంగా మరో గంట సమయం ఇవ్వొచ్చుగా?’ అని అడిగించేవాడిని. అయితే, గిల్ అలా అడుగుతాడని అనుకోను. అతడు మరీ సున్నితంగా ఉండే వ్యక్తి. కానీ, నేను మాత్రం కచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రశ్నించేవాడినే. ఇప్పుడైనా ఇవే ప్రశ్నలు అడుగుతున్నా’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.