ఏపీలో కోటి మొక్కలు నాటేందుకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చదనాన్నిపెంచే దిశగా ప్రణాళిక రూపకల్పన అంకురార్పణ జరిగింది. పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జూన్ 5 వ తేదీ ముహుర్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే బృహత్ కార్యక్రమానికి భారీ ఎత్తున చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో జిల్లా అధికార యంత్రాంగం అంతా చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలతో పాటు బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. “గత ఏడాది రాష్ట్రంలో పచ్చదనం 29 శాతం ఉండగా, ఈ ఏడాది అది 30.5 శాతానికి పెరిగిందని ఇది హర్షణీయమని చంద్రబాబు అన్నారు.

