లోకేశ్పై వైఎస్ఆర్సీపీ సెటైర్లు – ‘గచ్చిబౌలి దివాకర్ గుర్తొచ్చాడు’
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై వైఎస్ఆర్సీపీ మరోసారి వ్యంగ్య బాణాలు సంధించింది. నాలుగు గంటల్లో నాలుగు వేల మంది ప్రజల అర్జీలు విన్నామనే లోకేశ్ వ్యాఖ్యలపై పార్టీ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది.
“4 గంటల్లో 4 వేల అర్జీలు విన్నామంటారా? గంటకు వెయ్యి అర్జీలు వినడం సాధ్యమా? మహా అయితే గంటకు 40 అర్జీలను మాత్రమే వినగలం. లోకేశ్ చెప్పిన ఎలివేషన్లు చూస్తుంటే ‘గచ్చిబౌలి దివాకర్’ గుర్తొస్తున్నాడు” అంటూ వైఎస్ఆర్సీపీ అధికార ట్విట్టర్ హ్యాండిల్లో సెటైర్ వేసింది.
లోకేశ్ ఇటీవల తన ప్రజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని చెప్పిన నేపథ్యంలో, ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన ప్రజా సమీక్షా కార్యక్రమాన్ని “మొత్తం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే” అని విమర్శిస్తున్నారు.

