News

భూ సంస్కరణలపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్న వైఎస్ జగన్

భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృత్రంగా ప్రచారం చెయ్యాలని సీఎం జగన్ అధికారులను కోరారు. జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షపై క్యాంపు కార్యాలయంలో సీఎం మాట్లాడుతూ రెవిన్యూ విభాగంలో విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు, సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి కారణంగా ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై సమాచారాన్ని ప్రజల్లోకి పంపాలని కోరారు. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేక ఎల్లో మీడియా వక్రీకరిస్తోందని అన్నారు. ప్రజల్లో ఆందోళన కలిగించేలా తప్పుడు రాతలు రాస్తోందని… వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

గ్రామా సచివాలయం వల్ల మెరుగైన సేవలు

“చాలా రాష్ట్రాల్లో మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు సర్వేయర్లు మాత్రమే ఉంటే మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయంలో కూడా సర్వేయరు ఉన్నారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతోంది. రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాలకు తీసుకువస్తున్నాం. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారు ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా సాంకేతికతను తీసుకువస్తున్నాం. ఇన్ని సౌలభ్యాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంటే దానిపై తప్పుడు రాతలు, వక్రీకరణలు చేస్తున్నారు. మన ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణలు, వాటి వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలను సమగ్రంగా వివరించాలి” అని అన్నారు.

ఈ సందర్భంగా వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం సమగ్ర సర్వేలో ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. 13,460 గ్రామాలకు గాను, 12,836 గ్రామల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లైయింగ్‌ పూర్తి అయినట్లు తెలిపారు. ఈ పనిని అక్టోబరు 15లోగా పూర్తిచేస్తామని చెప్పుకొచ్చారు. 81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్‌ల ప్రక్రియ పూర్తియిందని… 60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలను జిల్లాలకు పంపే పని పూర్తిచేయాలన్నారు. ఫేజ్‌ -1లోగా భాగంగా తొలివిడతలో 2 వేల గ్రామాల్లో అన్నిరకాలుగా సర్వే పూర్తి అయిందన్నారు. మ్యుటేషన్లు, కొత్త సర్వే సబ్‌ డివిజన్లు, 19వేల సరిహద్దు సమస్యల పరిష్కారం, సర్వే రాళ్లు పాతడం సహా 7.8 లక్షల మందికి భూ హక్కు పత్రాలు పంపిణీ పూర్తయిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

బాధ్యత అధికారులదే – సీఎం జగన్

ఫేజ్‌-2లో సర్వే పూర్తయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి అన్నిరకాలుగా సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. “మొదటి దశలో సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలపై పూర్తిస్థాయిలో సమీక్ష చేయాలి. ఆయా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ఏర్పాటు చేశాం. గ్రామ సచివాలయాల్లో రిజస్ట్రేషన్‌ ప్రక్రియ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. అలాగే భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాలస్థాయిలో మొబైల్‌ కోర్టులు కూడా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలి”అని ఆదేశించారు. మున్సిపల్‌ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు వివరించారు. 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్‌ పూర్తయ్యిందని సూచించారు. 66 మున్సిపాల్టీల్లో ఇప్పటికే ఓఆర్‌ఐ ప్రక్రియ ముగిసిందన్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు.