వైజాగ్ రిషికొండ ప్యాలెస్ జగన్ తన సొంతానికి నిర్మించుకున్నారా?
వైజాగ్లో భారీ బారికేడ్ల వెనుక అత్యంత రహస్యంగా నిర్మించిన కొండపైన రాజభవనం, టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధానికి కారణమవుతోంది. రిషికొండ నిర్మాణాల నాణ్యత, ఖరీదైన భవనాల నిర్మాణం గురించి దేశ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు వైసీపీ సర్కారు ఈ నిర్మాణాలు వైఎస్ జగన్ కోసమేనంటూ టీడీపీ విమర్శిస్తుంటే, మరోవైపు ఇదేమీ సొంత భవనం కాదంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. మొత్తం రిషికొండ నిర్మాణాల వ్యవహారం, నాడు టీడీపీ నిర్మించిన తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు, తాజాగా వైసీపీ నిర్మించిన ఖరీదైన భవనాల మధ్య పొలికకు కారణమవుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిన వారం రోజుల తర్వాత ఆదివారం, ఈ భవనాలు ప్రజలకు దర్శనమిచ్చాయి. వైజాగ్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన జగన్, క్యాంప్ ఆఫీస్ కోసం రుషికొండ కొండపై నిర్మించిన భవనాలని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రతినిధి బృందం, మీడియా ఆదివారం బీచ్కి అభిముఖంగా “కొండపై ఉన్న ప్యాలెస్”లో మొట్టమొదటిసారిగా పర్యటించింది. ఒక్కసారిగా టీడీపీ నేతలు, జర్నలిస్టులు అక్కడకు చోరుకోవడం, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఈ భవనాలకు దేశంలోనే పేరు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతటి విలాసవంతమైన భవనాలను, ఇటాలియన్ మార్బుల్స్, అధునాతన టాయిలెట్ సామాగ్రిని వినియోగించారంటూ మీడియా ముఖంగా చేసిన ప్రచారం సంచలనం కలిగించింది.
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రుషికొండ హిల్స్పై అభివృద్ధి చేయనున్న టూరిజం ప్రాజెక్ట్ కోసం మే 2021లో కేంద్ర ప్రభుత్వం CRZ (కోస్టల్ రెగ్యులేటరీ జోన్) క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం జగన్ తన క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుని రాష్ట్ర ఖజానా నుంచి ₹ 500 కోట్లతో నిర్మించారని విమర్శించారు. రుషికొండ ప్యాలెస్ 9.88 ఎకరాల సముద్రానికి అభిముఖంగా విస్తరించి ఉంది. గత ప్రభుత్వం విలాసవంతమైన సౌకర్యాలు, నాణ్యమైన ఫర్నిషింగ్, మెరిసే షాన్డిలియర్లు, బాత్టబ్లు, ప్రభుత్వ నిధులను ఉపయోగించి రహస్యంగా నిర్మించిందని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ దుబారా, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్, మైనింగ్ బారెన్ గాలి జనార్ధన్ రెడ్డి నిర్మించిన ప్యాలెస్లతో పోల్చారు. ఈ ప్యాలెస్లో, సమీక్షలు, సమావేశాల కోసం రూపొందించిన పెద్ద కాన్ఫరెన్స్ హాల్ సైతం ఉంది. నిర్మాణ వ్యయాలను అత్యంత గోప్యంగా ఉంచి జగన్కు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులకు కాంట్రాక్టులు కట్టబెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది.
రూ.8 కోట్ల వరకు వార్షిక ఆదాయం వచ్చే రుషికొండలో పర్యాటకం కోసం ఉన్న గ్రీన్ రిసార్ట్లను ప్యాలెస్ కోసం కూల్చివేశారని టీడీపీ అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్టార్ హోటల్ అని, ఆ తర్వాత సీఎం క్యాంపు ఆఫీస్ అని, తర్వాత టూరిజం ప్రాజెక్ట్ అని పిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. 15 నెలల గడువుతో ₹ 91 కోట్ల బడ్జెట్తో స్టార్ హోటల్గా ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. అయితే కేవలం భూమిని చదును చేసేందుకు ₹ 95 కోట్లు, పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకు మరో ₹ 21 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ వాదిస్తోంది. నిర్మాణ కార్యకలాపాలను దాచి ఉంచేందుకు 20 అడుగుల బారికేడ్లను ఏర్పాటు చేయడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ప్రాజెక్ట్ కోర్టులో సవాలు చేసినప్పుడు, నిపుణుల కమిటీ అనేక ఉల్లంఘనలను గుర్తించినా, నిర్మాణం కొనసాగించారని గంటా తెలిపారు. అసలు బారికేడ్ల వెనుక ఏం జరుగుతోందో కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన డిప్యూటీ పవన్ కళ్యాణ్లకు కూడా ఎవరికీ తెలియదన్నారు. “దేవుని జోక్యం జగన్ రాజభవనాన్ని ఉపయోగించకుండా నిరోధించింది” అంటూ గంటా చమత్కరించారు. అయితే, ప్రజాధనంతో భారీ క్యాంపు కార్యాలయాన్ని, వైఎస్ జగన్ కోసమే నిర్మించారని విమర్శించడంపై , వైసీపీ నేతలు ఖండించారు. వైజాగ్ రాజధానిగా మారనున్నందున ప్రధాని, రాష్ట్రపతి, ఇతర ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉద్దేశించినదని, ఈ నిర్మాణాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసం కాదని పరిశ్రమల శాఖ మాజీ మంత్రి అమర్నాథ్ అన్నారు.
రిషికొండ నిర్మాణాలు చూపించినవారు, తాము చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా శాసన సభ్యులను తీసుకెళ్ళి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన హాస్పిటల్, వాటర్ ప్రాజెక్టు, పోర్టులు, హార్బర్ లు అన్నీ చూపించాలన్నారు. అన్నీ వదిలేసి అదేదో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత భవనంలా చూపిస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో నిర్మాణంలో ఇంటీరియర్ ఇంతలా అవసరమా అని అంటున్నారని, అది వరల్డ్ క్లాస్ నిర్మాణమని గుర్తించాలంటోంది వైసీపీ. విశాఖకు గవర్నర్, ప్రధాని, ఇతర దేశాల నుండి ఎవరైనా ప్రభుత్వ అతిథులు వస్తే ఉండేంత గొప్పగా ఉందని వైసీపీ చెబుతోంది.