యాదగిరిగుట్టలో.. ప్రపంచ సుందరి
చెక్ రిపబ్లిక్ మోడల్, మిస్ వరల్డ్ 2023 క్రిస్టినా పిస్జ్కోవా హైదరాబాద్ వచ్చారు. సాంప్రదాయ చీరకట్టు లో ఆమె మంగళవారం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకున్నారు . మే 7 నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2024-25 పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 20న నిర్వహించనున్న ప్రి లాంచ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు క్రిస్టినా హైదరాబాద్ లో అడుగు పెట్టారు. హైదరాబాద్ ఘన చారిత్రత్మాక సంపద చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్, చౌమొహల్లా ప్యాలెస్, గోల్కొండ లను సందర్శించనున్నట్లు క్రిస్టినా తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన 120 మంది అందాల భామలు యాదగిరి గుట్ట స్వామిని దర్శించుకునేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారని టూరిజం కార్యదర్శి స్మిత సభర్వాల్ తెలిపారు. క్రిస్టినా ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సందర్శించుకుని, దేవాలయ ఆధ్యాత్మిక సౌందర్య సంపద చూసి అచ్చెరువొందారని ఆమె చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని స్మిత సభర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు.