Home Page SliderNational

ట్రైలర్ రిలీజ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ సినిమా ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటివరకు సినిమా ట్రైలర్ ను విడుదల చేయకపోవడంపై ఓ అభిమాని నిరాశకు గురయ్యాడు.. ఏకంగా సూసైడ్ లెటర్ రాసి మరీ మూవీ మేకర్స్ షాకిచ్చాడు. మూవీ ట్రైలర్ విడుదలపై వెంటనే అప్డేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆ లెటర్ ద్వారా బెదిరించాడు. దీంతో ప్రస్తుతం సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ అభిమాని లెటర్ లో ఇలా రాశాడు.. గౌరవనీయులైన గేమ్ ఛేంజర్ గారికి నేను అనగా ఈశ్వర్, చరణ్ అన్న ఫ్యాన్. చింతిస్తూ రాయునది ఏమనగా.. సినిమా విడుదలకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఏ విధమైన ట్రైలర్ అప్డేట్ ఇవ్వడం లేదు. కనీసం అభిమానుల భావోద్వేగాలను పట్టించుకోవడం లేదు. ఈ నెల ఆఖరు కల్లా ట్రైలర్పై అప్డేట్ ఇవ్వకపోతే, కొత్త సంవత్సరం కానుకగా ట్రైలర్ విడుదల చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడుతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ విధేయుడు, చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్ అని లేఖలో రాసుకొచ్చాడు.