Home Page SliderTelangana

ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదామన్నారు. జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లన్న రేవంత్ రెడ్డి, కొందరు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. నాడు జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవని తేల్చి చెప్పారు. జర్నలిస్టుల సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందన్నారు. వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు.. అది మనకు మనమే పెంచుకోవాలని సూచించారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానమన్న ఆయన జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమేనన్నారు.

ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవని, కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని విచారం వ్యక్తం చేశారు. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారని, అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉందని జర్నలిస్టులకు సీఎం సూచించారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిదన్నారు. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారని ఆక్షేపించారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దన్నారు.

నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడెమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నాన్నారు. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేకుండా చేశారని, గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవన్నారు. మేం మీలో ఒకరమే… మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదేనని జర్నలిస్టులకు ఆయన భరోసా ఇచ్చారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి.