ఉదయం పెళ్లి.. సాయంత్రం ప్రియుడితో జంప్
పెళ్లి రోజున బ్యూటీ సెలూన్ కు అని చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైన ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పెళ్లింట ఇలా వధువు వెళ్లిపోయిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.పెరంబూర్లోని అంబేడ్కర్ నగర్ కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్ తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్ నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్ కు వెళుతున్నానని చెప్పి, కొంతమంది స్నేహితులతో వెళ్లింది. అనంతరం, అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ ఆఫ్ ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది. ఈ క్రమంలో బ్యూటీ సెలూన్ కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు ఒక్కసారిగా షాకై దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు. వి.కె.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పారిపోయిన నవ వధువు, ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.

