News

లంచాలు, వివక్ష లేని సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించాం: సీఎం జగన్

సమాజంలో ప్రతి ఒక్కరికి నేరుగా ఫలాలు
మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు
పేదోడికి ఏం మంచి చేసావో సెల్ఫీ ఛాలెంజ్‌కి సిద్ధమా చంద్రబాబు!

లంచాలు వివక్ష లేని పరిపాలనతో కేవలం నాలుగేళ్లలో చరిత్ర సృష్టించామని, కుల, మత, ప్రాంత రాజకీయ పార్టీలనే బేధం లేకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించామని.. పేదవారి ఆర్థిక స్వావలంభనకు పటిష్ట చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేశామని వివరించారు. మార్కాపురంలో నిర్వహించిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. 45 -60 ఏళ్ల మధ్యనున్న అత్యంత బాధ్యతాయుతమైన మహిళలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదరికానికి కులం, మతం ఉండదని.. పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తోడుగా ఉండాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు. ఓసీ కులాల్లోని పేద అక్క చెల్లెమ్మల కోసం ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నామన్నారు. 4.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.658 కోట్లు ఈరోజు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు వెల్లడించారు. వైయస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ఇప్పటివరకూ రూ. 1257 కోట్లు ఇచ్చామని.. దాదాపు 4 లక్షలమంది లబ్ధిదారులు రెండో దఫా అందుకున్నట్టు అవుతుందన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని సీఎం అభివర్ణించారు. అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా నిలబడాలని, సామాజికంగా, రాజకీయపరంగా, సాధికారత సాధించాలని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అమ్మ ఒడి దగ్గర నుంచి 30 లక్షల ఇళ్లపట్టాల వరకూ చాలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని సీఎం పేర్కొన్నారు.

మేనిఫెస్టోలో లేకున్నా వైఎస్సార్ ఈబీసీ నేస్తం అమలు

ఈబీసీ నేస్తంకాని, కాపు నేస్తంకాని ఈ పథకాలు ఏవీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదని.. ఎన్నికల్లో హామీలుగా కూడా ఇవ్వలేదని అయినా కూడా అగ్రకులాల్లోని పేదలకు మంచి జరగాలని, వారు పేదరికం నుంచి బయట పడాలని ఈ పథకాల్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. కేవలం 46 నెలల కాలంలోనే ఇప్పటికే రూ. 2.07లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారులకు నేరుగా ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇందులో 1.42 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వేసినట్లు వివరించారు. మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని కోటి యాభై లక్షలమంది కుటుంబాలకు చేస్తున్న మంచిని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు.

పేదవాడికి ఏం చేశావో సెల్ఫీ ఛాలెంజ్ చెయ్

గత ప్రభుత్వంలో 2014-19 మధ్య పేదవాడికి చేసిన మంచిపై పేదవాడి ఇంటి వద్ద నిల్చొని సెల్ఫీ ఛాలెంజ్ చేయాలని చంద్రబాబుకు సీఎం జగన్ సూచించారు. ఈ పని చంద్రబాబు చేయకపోవడానికి కారణం ఆయన హయాంలో పేదలకు ఒక్క రూపాయి కూడా ప్రయోజనం చేకూర్చకపోవడం కారణమని విమర్శించారు. సంక్షేమ పథకాల కింద వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డీబీటీ అమలు చేస్తుంటే.. గతంలో టీడీపీ ప్రభుత్వం దొచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్దతి అమలు చేసిందని మండిపడ్డారు. మీ బిడ్డ ప్రభుత్వంలో.. మీ బ్యాంకుల ఖాతాల్లోకి.. అది కూడా మీ పాత బాకీలకు జమచేసుకోలేని విధంగా… వాటిని మార్చి… అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఆసరా , చేయూత.. వంటి పథకాల కింద పేదలకు లబ్ది చేకూర్చామన్నారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే ఫేక్ ఫొటోలు కాదని.. పేదవాడికి చేసే మంచే తనకు సెల్ఫీ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రతి పేద ఇంటి ముందు నిలబడి… ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ.. అని చెప్పగలవా అని బాబను సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రతి పేద ఇంటికి వెళ్లినప్పుడు నువ్వు బాగా చేశావయ్యా అని అక్క చెల్ల్మెమ్మలు ఆశీర్వదించగలిగితే.. దాన్ని గొప్ప సెల్ఫీ అంటారని సీఎం పేర్కొన్నారు.

ఎల్లో బ్యాచ్ ను నిలదీయాల్సింది ప్రజలే..

చంద్రబాబు నిజాలు దాచి అబద్దాలు అసత్య ప్రచారాలతో తన ఎల్లో మీడియాను ఉపయోగించుకుని ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఈ అబద్ధాల బ్యాచ్‌ను ఎక్కడికక్కడ ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. గత ఐదేళ్ల హయాంలో ఒక్క ఇళ్లస్థలమైనా ఎందుకు ఇవ్వలేకపోయారని వైఎస్సార్ సీపీ హయాంలో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ఎలా సాధ్యపడిందని ఎల్లో బ్యాచ్ ను నిలదీయాలని కోరారు.