Breaking NewsHome Page SliderNational

భారత్‌కు యుద్ద ముప్పు

భార‌త్ కు..రెండు పొరుగు దేశాల నుంచి ఏకకాలంలో యుద్ధ ముప్పు పొంచివుందంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సైనిక సన్నద్ధత, సరిహద్దుల వెంబడి పరిస్థితులు, బంగ్లాదేశ్ అంశం తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాకిస్థాన్‌లు కుమ్మక్కవుతున్నాయని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువు అయిన పాక్, చైనాతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఆందోళనకరమని అన్నారు. చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్ వినియోగిస్తోందని, కుమ్మక్కుకు సంబంధించి నేడున్న పరిస్థితి దీనికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఆ రెండు దేశాల మధ్య కుట్రపూరిత సంబంధాలు ఉన్నాయన్న వాస్తవాన్ని భారత్ అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌కు సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని అన్నారు. అయితే, భారత్ – బంగ్లాదేశ్‌ల మధ్య సైనిక బంధం బలంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.