ట్రంప్ పంజా, వెనిజులా అధ్యక్షుడు బందీ
గత కొంతకాలంగా అమెరికా-వెనెజువెలా మధ్య ముదురుతున్న విభేదాలు చివరకు యుద్ధానికి దారితీశాయి. శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కరాకస్పై అమెరికా వాయుసేన, ప్రత్యేక దళాలు కరాకస్లోని అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి మెరుపు దాడులు నిర్వహించింది.ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ను, అమెరికా దళాలు తమ అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధ్రువీకరించారు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో అమెరికా వాయుసేన, ప్రత్యేక దళాలు అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లతో వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు జరిపి, వెనెజువెలా రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని, తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పోస్టు చేశారు. అమెరికా సైన్యానికి చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్లో భాగమైందని, కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ఈ ఆపరేషన్ ముగించి, మదురో దంపతులను బంధించి భద్రతా దృష్ట్యా సురక్షిత ప్రదేశానికి వారిని తరలించినట్లు తెలిపారు. వెనెజువెలాలో నియంతృత్వానికి ముగింపు పలికేందుకే ఈ చర్య తీసుకున్నామని అమెరికా స్పష్టం చేసింది. నికోలస్ మదురో, ఆయన భార్య ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా వారిని వెనెజువెలా సరిహద్దులు దాటించి సురక్షిత ప్రాంతానికి తరలించామని డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి ప్రకటించారు. ఈ యుధ్దంలో వెనెజువెలా అతలాకుతలమైంది. కరాకస్ వీధుల్లో ట్యాంకులు, సైనికులు పహారా కాస్తుండగా, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని అమెరికా స్పష్టం చేసింది. ముప్పై ఏడేళ్ల తర్వాత ఒక లాటిన్ అమెరికన్ దేశంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. ఆ ఏడాది పనామాపై దాడిచేసి, మిలిటరీ నేత మాన్యుయెల్ నోరిగాను పదవీచ్యుతుడిని చేసింది. ఈ పరిణామాల వేళ వెనెజువెలా పక్కదేశమైన కొలంబియా అప్రమత్తమైంది. ఆ దేశ సరిహద్దుల్లో బలగాలను మోహరించింది. మదురో అమెరికా కస్టడీకి చిక్కడంతో వెనెజువెలాలో తమ సైనిక చర్య పూర్తయిందని యూఎస్ సెనెటర్ మైక్ లీ వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

