“ఆదివాసీ జీవనమే నాగరిక ప్రజలకు కూడా ఆదర్శం”..స్పీకర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆగస్టు 9న ఘనంగా వేడుకలను నిర్వహించింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కుమ్రంభీమ్ ఆదివాసి భవన్ లో జరిగిన ఈ వేడుకలలో ముఖ్యఅతిథులుగా శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, పంచాయితీరాజ్ శాఖ మంత్రి డా॥ దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ “ఒకప్పుడు ధనికులు చీదరించుకున్నఆదివాసీ సంస్కృతే ఇప్పుడు శాస్త్రీయమైనదని, ఆరోగ్యకరమైనదని పాటిస్తున్నారు. ఉదాహరణగా ఇప్ప పువ్వులను తీసుకుంటే… ఇప్ప పువ్వు, కాయల నుంచి ఎన్నో రకాల ఆహార పదార్థాలు, నూనెలు, చివరికి కల్లును కూడా ఆదివాసీలు తయారు చేసుకుంటారు. కాబట్టి ఇప్ప పువ్వుల చెట్టు వంటి ఎన్నో రకాల చెట్లను ఆదివాసీలు కొట్టక అటవీ సంరక్షణ చేస్తుంటారు. ఇలాంటి ఆదివాసీ జీవనమే నాగరిక ప్రజలకు కూడా ఆదర్శం, ఆచరణీయం’ అన్నారు.

వేడుకలలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన తెగలకు చెందిన ఆదివాసీ కళాకారులు తమ ఆటపాటలతో అతిథులను ఆహ్వానంపలికారు. అనంతరం అతిథులు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద, కుమ్రం భీమ్, రాంజీ గోండ్ విగ్రహాల వద్ద పూజలు చేశారు. ఆ తరువాత ఆదివాసీ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఉత్పత్తులు, హస్తకళలను తిలకించి కొన్ని కళాఖండాలను కొనుగోలు చేశారు. కార్యక్రమాలలో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినీ విద్యార్థులు, ఆటగాళ్లు, కుటీర పరిశ్రమల బృందాలను అతిథులు సన్మానించారు.

ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ జాటోత్ రాంచందర్ నాయక్ (విప్), డా॥ మురళీ నాయక్ భూక్యా (మహబూబాబాద్), శ్రీ బెల్లయ్య నాయక్, టైకార్ ఛైర్మన్, డా॥ ఎ.శరత్, సెక్రటరీ & కమీషనర్, గిరిజన సంక్షేమ శాఖ, శ్రీమతి కె. సీతాలక్ష్మి, సెక్రటరీ, గురుకులం, ఇతర ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు, కుల పెద్దలు, మేడారం జాతర పూజార్ల సంఘం అధ్యక్షులు శ్రీ సిద్ధబోయిన జగ్గారావు బృందం తదితరులు పాల్గొన్నారు. అతిథులకు ఆదివాసీ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.

