ఖాళీగా బయలుదేరిన జన సాధారణ్ ట్రైన్.. ఆగ్రహంలో ప్రయాణికులు
సంక్రాంతి పండగ సందర్భంగా రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్న సమయంలో విశాఖ నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జన సాధారణ్ రైలు ఖాళీగా బయలుదేరింది. రైల్వే అధికారులు ఎలాంటి ప్రచారం చేయకపోవడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. పావుగంట ఆలస్యంగా విశాఖ నుంచి ఉదయం 10 గంటలకు ఈ రైలు బయలుదేరింది. సమాచారం లేని కారణంగా ఈ ట్రైన్ గురించి ప్రయాణికులకు తెలియలేదు. దీంతో మిగతా రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండగా.. ఈ ట్రైన్ విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరడం గమనార్హం. రిజర్వేషన్ అవసరం లేకుండా సామాన్య ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ట్రైన్ ఖాళీగా బయలుదేరింది. సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే అధికారులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.