Home Page SliderTelangana

చొప్పదండి ఎమ్మెల్యేకు బెదిరింపు ఫోన్ కాల్

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన ఘటన కలకలం రేపింది. గత సెప్టెంబర్ 28వ తేదీన వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చినట్లు ఎమ్మెల్యే పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో నిందితుడు మాట్లాడుతూ.. తనకు రూ. 20 లక్షలు చెల్లించాలని లేదంటే రాజకీయంగా అప్రతిష్టపాలు చేస్తానని, ఇద్దరు పిల్లలను అనాధలు అయ్యేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు వివరించారు. ఈ మేరకు 339/2024, భారతీయ న్యాయ సంహిత 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవాని నగర్ కి చెందిన యాస అఖిలేశ్ రెడ్డి గా గుర్తించారు. ఇతడు ప్రస్తుతం లండన్ లో ఉన్నాడని, అక్కడి నుంచే బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.