ఏపీకి పొంచివున్న తుఫాన్ ముప్పు
వరుస వర్షాలతో సతమవుతున్న ఏపీకి వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. ఏపీలోకి తుఫాన్ ముంచుకొస్తుందని తెలిపింది. ఈ మేరకు ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది కాస్త తుఫాన్గా మారే అవకాశముందని వాతావరణశాఖ ఏపీకి హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్గా ఏర్పడితే సిత్రాంగ్గా పేరు పెట్టాలని వాతావరణశాఖ నిర్ణయించింది. ఈ తుఫాన్ ప్రభావం ఏపీ,ఒడిశా,బెంగాల్ రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని కారణంగానే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని తెలిపింది. కాగా తెలంగాణాలో వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని అనంతపురం జిల్లా ఈ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. భారీగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి.