ఆ రెండు పార్టీలు రహస్య స్నేహితులు
బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు . సోమవారం కరీంనగర్ లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ …మేడిగడ్డ ప్రాజెక్ట్ లాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో రాజకీయ జోక్యం లేదని , ఫోన్ ట్యాపింగ్పై అధికారులే విచారణ చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్తో లోపాయికారిగా ఒప్పందం చేసుకుందని విమర్శించారు. తమ మేనిఫేస్టోలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్పై జ్యూడీషనల్ ఎంక్వైరీ వేస్తామని చెప్పామని.. అన్నట్లుగానే వేశామని గుర్తుచేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని , 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందని చెప్పుకొచ్చారు. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని ప్రశ్నించారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే జనం నమ్ముతారా అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణకు ఎవరినీ పిలవాలన్నది సిట్ అధికారులే నిర్ణయిస్తారని వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్దేనని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

