ఇది జాగృతి విజయమే
తెలంగాణ జాగృతి పోరాటాల ఫలితంగానే ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, ఇది ముమ్మాటికీ తమ సంస్థ సాధించిన విజయమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం పేర్కొన్నారు. ‘జనంబాట’ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పర్యటనలో ప్రజలు ఫిర్యాదు చేయడంతోనే తాను ఈ భూ అక్రమాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని, దీనిపై విజిలెన్స్ మరియు రెవెన్యూ అధికారులతో విచారణను స్వాగతిస్తున్నామని ఆమె తెలిపారు. రాజకీయ కారణాలతో తమ కుటుంబంపై ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ఆరోపణలు ఈ విచారణతో తేలిపోతాయని స్పష్టం చేసిన కవిత, ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా విచారణను వేగంగా పూర్తి చేసి అక్రమార్కుల నుంచి ఆ భూములను విడిపించి ప్రజలకు దక్కేలా చేయాలని డిమాండ్ చేశారు.

