స్మశానంలో దొంగలు.. మృత దేహాల చోరీ..
వరంగల్ జిల్లాలో వింత దొంగలు చెలరేగిపోయారు. క్షుద్ర పూజలు కోసం స్మశానంలో అస్థికల చోరీకి పాల్పడ్డారు దొంగలు. అమావాస్య రోజున క్షుద్రపూజలు చేసేందుకు భీమారం స్మశాన వాటికలో ఖననం చేసిన మృత దేహాల అస్థికలను అపహరిస్తున్న వ్యక్తిని మృతుడి బంధువులు పట్టుకున్నారు. ఆగంతకులు రెండు మృత దేహాల అస్థికలను అపహరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే అంత్యక్రియల సమయంలో నోట్లో బంగారం పెడతారు. దానిని తీసుకొనేందుకు ఖననం చేసిన మృత దేహాలను వెలికితీశామని దొంగలు చెబుతున్నారు. తాము ఎలాంటి క్షుద్ర పూజలు చేయడం లేదన్నారు. ఏది ఏమైనా దొంగలు స్మశాన వాటికలను టార్గెట్ చేసుకొని మృత దేహాలను కూడా వదలడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

