తెలంగాణలో ఈ కల్తీ మందులు బ్యాన్
చిన్నారులకు వాడే రెండు రకాల మందులను తెలంగాణలో బ్యాన్ చేశారు. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు దగ్గు మందులను నిషేధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించారు. వీటిని గుజరాత్కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలుగా పేర్కొన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్ రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ‘కోల్డ్ రిఫ్’ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ ఔషధాలు ఆరోగ్యానికి హానికరమని, వీటిలో ఉన్న కొన్ని పదార్థాలు దుర్వినియోగానికి గురవుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. DCAఅధికారులు ఈ రెండు మందులపై పరీక్షలు నిర్వహించి, వాటి వాడకం వల్ల అనర్థాలు కలుగుతున్నట్లు గుర్తించారు. తదనంతరం ప్రభుత్వం వాటి తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

