ఇంత దద్దమ్మ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు
ప్రభుత్వ గురుకులాల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఒక్క పూట కూడా సరిగ్గా అన్నం పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని మాజీ మంత్రి కేటిఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మంత్రులు తినే ఒక్క ప్లేటు భోజనం రూ. 32 వేలు చొప్పున వ్యయపరిచి జనం సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని కానీ గురుకులాల్లో సరైన పౌష్టికాహారం లేక బక్కచిక్కిపోతున్న విద్యార్ధులకు నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి తన అసమర్థ పాలనతో నేడు విద్యార్థులు గురుకులాలకు పోవాలంటేనే భయపడే స్థితికి తెచ్చాడని కేటిఆర్ ఆరోపించారు.రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన ఏడాది కాలంలోనే మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. గతేడాదితో పోలిస్తే 2024లో 28.94% మేర పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.డబ్బు సంచులు కోసం మూసీ ప్రాజెక్టు మీద రోజుకో సమీక్ష చేసే రేవంత్, ఆడబిడ్డలపై పెరిగిన నేరాలపై మాత్రం సమీక్షలు చేయడంలేదని విమర్శించారు.రాష్ట్రంలో అసలు హోం మంత్రి ఉన్నాడా? అని ఆయన ప్రశ్నించారు. అసమర్థ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే శాంతి భద్రతల పర్యవేక్షణ వైఫల్యం, తక్షణం ఆదేశాలిచ్చే వ్యవస్థ లోపించడంతో క్రైమ్ రేటు దారుణంగా పెరిగిపోయింది. ప్రతి మూడు గంటలకో రేప్, ఐదు గంటలకో కిడ్నాప్, ఏడు గంటలకో మర్డర్ – ఇదీ పాలన చేతగాని తుగ్లక్ రేవంత్ పాలనలో తెలంగాణలో నమోదు అవుతున్న క్రైమ్ రేట్ అంటూ ధ్వజమెత్తారు.మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి, మహిళలపై తీవ్రమైన దాడులు జరుగుతున్నా కనీసం వాళ్లకు రక్షణ కూడా కల్పించలేని అసమర్థుడు ఈ చిట్టి నాయుడంటూ స్వరం పెంచి మాట్లాడారు.