‘స్క్రిప్ట్ చంద్రబాబుది..స్పీచ్ పవన్ది ‘- మంత్రి అమర్నాథ్
రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ‘స్క్రిప్ట్ చంద్రబాబుది..స్పీచ్ పవన్ది’ అని వ్యాఖ్యానించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. కేవలం అధికారంలోకి రావడానికి ఎదుటి పార్టీపై పోరాటం చేయాల్సింది మానేసి రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చేలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హితవు చెప్పారు. కాపు నేత వంగవీటి రంగాను చంపిన వ్యక్తిని, ముద్రగడను చంపేయాలనుకున్న వ్యక్తి చంద్రబాబు అని అటువంటి వ్యక్తి ఇచ్చిన బిస్కెట్ల కోసం, ప్యాకేజీల కోసం పవన్ పరుగెత్తుతున్నాడని, ప్యాకేజీ కోసం కులాన్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నాడని రాష్ట్ర ప్రయోజనాలు పవన్కు పట్టడం లేదని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు.

సీఎం జగన్ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు
రాష్ట్రంలో ఏరకమైన అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోవాలని ప్రజల బాగోగులు ఈ ప్రభుత్వం ఏరకంగా చూస్తుందో కళ్లు తెరిచి చూస్తే తేటగా కనిపిస్తాయని రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, పేదవాడికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు 2024లో మళ్లీ ఇవన్నీ వైయస్ జగన్ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఉపయోగపడుతున్నాయన్నారు. ఇదే విషయాన్ని వైసీపీ బలంగా నమ్ముతుందని సీఎం జగన్ కూడా ఎమ్మెల్యేల సమీక్షలో స్పష్టంగా చెప్పారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ బ్రాండ్ చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. గతంలో ఏపీ వైపు చూడని సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని, 2022లో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 18 శాతం రాష్ట్రానికే వచ్చాయన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు ఏపీ వైపు అడుగులు వేస్తున్నాయని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు ఎలక్ట్రికల్, ఐటీ రంగాల్లో సంస్థలు వస్తున్నాయని ఇన్ని కంపెనీలు ఏపీకి వస్తుంటే ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తూ నెగిటివ్ బ్రాండ్ను క్రియేట్ చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

