పోలవరం ప్రాజెక్టు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి
•పోలవరం తొలిదశ బడ్జెట్ రూ. 12,911 కోట్ల విడుదలపై కేంద్ర కేబినేట్ కు నోట్
•*ఆగష్టు నాటికి అవుకు రెండో టన్నెల్ పూర్తి
•ఇరిగేషన్ శాఖ సమీక్షలో సీఎం జగన్
పోలవరం ప్రాజెక్టు తొలిదశ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసేలా పనులు చేపట్టాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్పై కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, కేంద్ర కేబినెట్లో పెట్టేందుకు కేబినెట్ నోట్ తయారీ, వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వచ్చినట్లు సీఎం జగన్ వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర కీలక ప్రాధాన్యతా ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం జగన్ సమగ్రంగా చర్చించారు. అధికారులు మాట్లాడుతూ సీఎంవో ఆదేశాల మేరకు క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు విడుదలచేస్తున్నామని, ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదలచేసినట్లు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు సమీక్షలో భాగంగా వివిరించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని, గ్యాప్-2 వద్ద కూడా ఇదే పనులు చురుగ్గా సాగుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్ బండ్లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని, నేల స్వభావంలో మార్పల కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ వెల్లడించిందని తెలిపారు. దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్తో, సిమెంట్ స్లర్రీతో నింపాలని, గేబియన్స్తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందన్నారు. పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
పోలవరంతో పాటు ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తి దృష్టిసారించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వెలగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులపై సీఎం జగన్ ఈ సంధర్భంగా ప్రత్యేకంగా చర్చించారు. అవుకు రెండో టన్నెల్ నిర్మాణం పూర్తికానుందని, చివరిదశలో లైనింగ్ పనులు చేపడుతున్నట్లు, ఆగస్టులో అవుకు రెండో టన్నెల్ ప్రారంభించేందకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. అవుకు ద్వారా 20వేల క్యూసెక్కుల సముద్రంలో కలిసే కృష్ణా వరదజలాలను రాయలసీమ దుర్భిక్షప్రాంతానికి తరలించేందుకు మార్గం సుగమమైందని, వరదలు సమయంలో సముద్రంలో కలవకుండా నీటిని కరవుపీడిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందన్నారు.

వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే మొదటి టన్నెల్ పూర్తయ్యిందని, రెండో టన్నెల్ పనులు కూడా కొలిక్కివస్తున్నాయని అధికారులు తెలిపారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14 శాతం పూర్తయ్యాని, ఆగస్టు నాటికి హెడ్ రెగ్యులేటర్ పనులు మొత్తం పూర్తిచేస్తామని వివరించారు. టన్నెల్ తవ్వకం పనులు 18,787 మీటర్లకుగానూ, 17,461 మీటర్లు పూర్తిచేసినట్లు వివిరించారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు అప్రోచ్ ఛానల్, తీగలేరు హెడ్ రెగ్యులేటర్, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తవుతున్నట్లు తెలిపారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది వంశధార స్టేజ్-2, ఫేజ్-2 కింద డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ను పూర్తిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. గొట్టాబ్యారేజీ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా హిరమండలం రిజర్వాయర్ను నింపే కార్యక్రమం వీలైనంత త్వరగా ప్రారంభం అయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తోటపల్లి బ్యారేజీ కింద మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ రిజర్వాయర్లతో సహా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి కావస్తున్నట్లు తెలిపారు.
ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డులపై హర్షం
ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డుల (నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022) సాధించడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఏపీ తృతీయ స్ధానంలో నిలవగా, ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేతుల మీదుగా జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ అవార్డు అందుకున్నారు. అవార్డుల సాధించడంపై జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణను సీఎం జగన్ అభినందించారు.