మహిళా ఐపీఎల్ ఫ్రాంచైజీ కనీస ధర రూ.400 కోట్లు
భారత క్రికెట్లో ఇక మహిళా ఐపీఎల్ శకం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న మహిళా ఐపీఎల్ క్రికెట్ జట్ల ఫ్రాంచైజీకి వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఒక జట్టు ఫ్రాంచైజీకి కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ధారించింది. మహిళా క్రికెట్ జట్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్, ఆసక్తిపై అధ్యయనం జరిపిన బీసీసీఐ.. ఒక్కో జట్టు రూ.1000-1500 కోట్లకు అమ్ముడవుతుందని ఆశిస్తోంది. బిడ్ గెలిచిన ఫ్రాంచైజీ ఈ డబ్బులను ఐదేళ్లలో విడతల వారీగా చెల్లించే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. పురుషుల క్రికెట్ జట్టును కలిగి ఉన్న ఫ్రాంచైజీలు కూడా మహిళల జట్టును కొనుక్కునేందుకు అవకాశం ఇచ్చింది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల ఫ్రాంచైజీలు మహిళా జట్ల ఫ్రాంచైజీలు కొనాలని ఆసక్తి చూపిస్తున్నాయి.

