మరణ శిక్ష పడ్డ ఖైదీలను నిర్దోషులుగా ప్రకటిస్తూ.. సుప్రీం తీర్పు
19 ఏళ్ల యువతిని రేప్ చేసి చంపిన కేసులో మరణ శిక్ష పడిన దోషులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఛీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. 2012లో ఉత్తరాఖండ్కు చెందిన రవి, రాహుల్, వినోద్.. ఢిల్లీలో ఓ యువతిని గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా చంపేశారు. పట్టుబడ్డ నిందితులకు ఢిల్లీ హైకోర్టు గతంలో మరణ శిక్ష వేసింది. దీనిపై నిందితులు సుప్రీంకు వెళ్లగా తాజాగా వారి మరణశిక్ష రద్దుతోపాటు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.
అంతకు ముందు శిక్షను తగ్గించాలంటూ దోషుల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వాళ్ల వయసు, కుటుంబ నేపథ్యాలు, గత చరిత్రలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఇక.. ఢిల్లీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి… ఈ గాయం బాధితురాలిది మాత్రమే కాదని… సమాజనిదని వాదించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం… కీలక తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా… బాధితురాలి తండ్రి బాధను తాను అర్థం చేసుకోగలనని సీజేఐ లలిత్ తెలిపారు. అయితే.. వాస్తవాలు, సాక్ష్యాలు – ఆధారాల ఆధారంగా తీర్పు ఉంటుందని, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పదారి పట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ.. ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు.

