ఉగ్ర కుట్ర భగ్నం.. ఐసిస్ ఉగ్రవాదులు అరెస్టు
దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసులు కేంద్ర ఏజెన్సీల సహకారంతో భగ్నం చేశారు. ఈ మేరకు అతి పెద్ద ముప్పు తప్పినట్లైంది. ఢిల్లీ, ముంబై, జార్ఖండ్లలో ఒకేసారి నిర్వహించిన దాడుల్లో ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులు పోలీసుల కంట పడ్డారు. వారిలో ఇద్దరిని ఢిల్లీలో, మరొకరిని జార్ఖండ్లోని రాంచీ నుంచి అరెస్టు చేశారు. మిగతా ఇద్దరిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఆపరేషన్లో ఉగ్రవాదుల వద్ద నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు, బాంబు తయారీకి ఉపయోగించే రసాయనాలు, ఇతర నిషేధిత వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో అరెస్టయినవారిని ముంబై నివాసితులైన అఫ్తాబ్, సుఫియాన్గా గుర్తించారు. రాంచీ నుంచి పట్టుబడిన ఉగ్రవాది డానిష్గా పోలీసులు ధృవీకరించారు. వీరంతా దేశవ్యాప్తంగా భారీ దాడులు జరపడానికి కుట్ర పన్నారని విచారణలో తేలింది. డానిష్ నివాసంలో పోలీసులు రహస్యంగా దాచిన ఐఇడి తయారీ రసాయన పదార్థాలు, ఒక దేశీయ పిస్టల్, లైవ్ కార్ట్రిడ్జ్ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో అరెస్టయిన అఫ్తాబ్, సుఫియాన్ల వద్ద కూడా భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. సమాచారం ప్రకారం ఈ ఉగ్రవాదులు స్లీపర్ సేల్స్ ద్వారా దేశవ్యాప్తంగా దాడులు చేయాలని ప్రణాళిక రచించారు. ముఖ్యంగా ఢిల్లీతో పాటు పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరపాలని కుట్ర పన్నారని పోలీసులు వివరించారు. ఢిల్లీ ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులు ఈ ఆపరేషన్ను తమ అత్యంత విజయవంతమైన చర్యలలో ఒకటిగా పేర్కొన్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారబోయే ఈ కుట్రను సకాలంలో అడ్డుకోవడం తమకు పెద్ద విజయమని వివరించారు.తెలిపారు.