జమ్ముకశ్మీర్ లో 10 మంది సైనికులు మృతి
జమ్మూకశ్మీర్లోని దోడా సెక్టార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 10 మంది ఆర్మీకి చెందిన సైనికులు ప్రాణాలు కొల్పొయారు. పలువురికి తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే జవాన్లు , పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఉధంపూర్ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. భదేర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారి వెంబడి ఖన్నీ టాప్ దగ్గర డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం 200 అడుగల లోయలో పడినట్లు ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. గాయపడిన వారిలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యాదికారులు పేర్కొన్నారు.
ఆర్మీ వాహనం మొత్తం 17 మంది జవాన్లతో హై ఆల్టిట్యూడ్ పోస్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే పది మంది సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
లెఫ్ట్నెంట్ గవర్నర్ సిన్హా సంతాపం
జమ్మూకశ్మీర్లో జరిగిన ఘటనపై లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ధ్రువీకరించారు. దోడాలో చోటుచేసుకున్న దుర్ఘటనలో 10 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. మృత జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన సైనికులను ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించామని, వారికి ఉత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ సిన్హా ఆకాంక్షించారు.

